. . . అంచనాలకనుగుణంగా పని చేయాలి
. . . రాష్ట్రానికి తలమానికంగా యాదగిరి గుట్ట ని అభివృద్ధి చేయాలి
. . . అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండాసురేఖ
యాదాద్రి, బతుకమ్మ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు యాదగిరిగుట్టను దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండాసురేఖ యాదగిరిగుట్ట నూతన పాలకమండలికి సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖ్యాతిని మరింత పెంచే బాధ్యత నూతన పాలక మండలిపై ఉందని వారు పాలకమండలికి దిశానిర్దేశం చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానానికి చేరుకున్న మంత్రి కి ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్ని తర్వాత వేదపండితులు మంత్రి సురేఖ కి వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భవానీ శంకర్ మంత్రి కి లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. చైర్మన్ ఎం.సత్యనారాయణ రెడ్డితో పాటు హాజరైన పాలక మండలి సభ్యులు ఆలయ ముఖమండపం ప్రాంగణంలో మంత్రి సురేఖ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందిస్తూ, దేశవ్యాప్తంగా భక్తులకు ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, సభ్యులు అంకితభావంతో పనిచేస్తూ ఆలయ అభివృద్ధి, పారదర్శక పాలన, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, పాలక మండలి సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి దేవస్థానం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
