నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎన్సీసీ 12 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభమైంది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ 10 రోజుల శిబిరంలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 520 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 12 మంది అసోసియేట్ ఎన్సీసీ అధికారులు (ఏఎన్ఓలు) పాల్గొంటున్నారు. శిబిరాన్ని ఉద్దేశించి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి. నాయర్ మాట్లాడుతూ, ఈ శిబిరంతో పాటు టీఎస్సీ, ఐడీఎస్ఎస్సీ ఎంపిక ప్రక్రియలు కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్లు ‘ఏ’, ‘బీ’, ‘సీ’ సర్టిఫికేట్ పరీక్షలకు హాజరుకావాలంటే ఈ తరహా వార్షిక శిక్షణా శిబిరంలో పాల్గొనడం తప్పనిసరి అని పేర్కొన్నారు. శిబిరంలో మిలిటరీ శిక్షణ, డ్రిల్, ఆయుధాల వినియోగం, రైఫిల్ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్ తదితర అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించడమే ఎన్సీసీ శిక్షణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. స్వచ్ఛ భారత్, రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా క్యాడెట్లకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిబిరం మొత్తం క్యాడెట్లు సైనిక వాతావరణంలోనే శిక్షణ పొందనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ రాచ్ పాల్ సింగ్, ట్రైనింగ్ జేసీఓ రానా, సునీల్, మహేందర్, భగత్, ఏఎన్ఓలు కెప్టెన్ బాబురావు, లెఫ్టినెంట్ రామస్వామి, నవీన్ కుమార్, ప్రమీల, ఇస్మాయిల్, ప్రవీణ్, శ్రీపాద్, తుకారాం, మధుబాబు, ముత్తెన్న, రోహిదాస్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
