. . . సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
దేశంలో ఉన్న ప్రజలంతా అసమానతలు లేని సమాజం లో నివసించాలనే ఆశయంతో తుది వరకు పోరాడిన వ్యక్తి నాయక్వాడి నర్సన్న అని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి లో నాయిక్వాడి నర్సయ్య సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…..జగిత్యాల, శ్రీకాకుళ రైతాంగ పోరాటాల్లో ఉద్యమం వ్యాప్తిలో వీధి నాటకం ద్వారా ఎంతో మంది రైతులు, రైతు కూలీలు చైతన్య పరిచిన కాగడా లాంటి వ్యక్తి నర్సన్న అని కొనియాడారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సింగూరు ఇందూరు హక్కు అని, నిజాంసాగర్ ఆయకట్టు నిజామాబాద్ జిల్లాలకు సాగు, తాగు నీరు కోసం పోరాడి సాధించిన వ్యక్తుల్లో నర్సన్న మొదటి వ్యక్తి అన్నారు. దేశ నడి బొడ్డున (ఢిల్లీ) లో జరిగిన రైతాంగ పోరాటానికి ఢిల్లీ వెళ్లి మద్దతు తెలిపారు అన్నారు. సంఘం కొలిమిలో రాటు తేలిన ప్రజల మనిషి నర్సన్న అని అన్నారు.

న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో మెజారిటీ గా ఉన్న హిందూ మత యువతను, ప్రజలను మతం, కులం అనే మత్తును పూసి మోసం చేస్తుందన్నారు. ఇలాంటి కల్లబొల్లి మాటలతో మోదీ, అమిత్ షా ఎన్నికల్లో గెలిచి యువతకు ఉపాధిని ఇచ్చే పరిశ్రమలను మూత వేసి ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. దేశంలోకి ఉగ్రవాదులు వచ్చి భారత దేశ ప్రజలను, భారత సైన్యం ను కాల్చి చంపిన ప్రధాని లో చలనం లేదు అన్నారు. కనీసం దాడులు జరిగిన ప్రదేశాలను సందర్శించిన పరిస్థితి లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఆర్మీ, నేవీ, రైల్వే, విమాన , ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ, టాటా లకు కట్టబెట్టి దేశ ప్రజలను మోసగిస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు.ప్రశ్నించే గొంతుకలను ఉండకూడదు అని ఆదివాసీలను, మావోయిస్టులను చంపుతూ, భయపెట్టి అడవుల నుంచి గెంటి వేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. అడవుల్లో ఉన్న సహజ సిద్ధంగా ఉన్న సంపద యురేనియం, మాంగనీసు, బొగ్గు, కొల్లగొట్టడానికి అడవులను నరుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశ సంపద రక్షణ కోసం యువత ఉద్యమానికి సిద్ధం కావాలని నర్సన్న స్ఫూర్తి తో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, నిజామాబాద్ డివిజన్ పరుచూరి శ్రీధర్,ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఎన్ దాసు, ఎఐ కేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా ,న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు సూర్య శివాజీ, భూమన్న, నర్సన్న భార్య లక్ష్మీ ,న్యూడెమోక్రసీ పార్టీ శ్రేణులు , నర్సన్న బంధువులు, అర్సపల్లి వాసులు తదితరులు పాల్గొన్నారు.