కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ శియాలి రామామృత రంగనాథన్ సేవలను కళాశాల సిబ్బంది, విద్యార్థులు స్మరించుకున్నారు. 1892 ఆగస్టు 12న జన్మించిన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ భారతదేశంలో గ్రంథాలయ, సమాచార శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయనను “ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా”గా గౌరవిస్తారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో గ్రంథాలయానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. పుస్తక పఠనం వల్ల జ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, ఉన్నత విద్యను అభ్యసించేవారికి గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. “పుస్తకం మనిషికి మంచి మిత్రుడు” అని, విద్యార్థులు నిరంతరం పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, లైబ్రేరియన్ కవిత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
