ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల పరిధిలోని తోర్తి గ్రామంలో జాతీయ పక్షి నెమలి విష గుళికలు తిని మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన నెమలిని పరిశీలించారు. అనంతరం పశువైద్య అధికారి నెమలికి పోస్టుమార్టం నిర్వహించారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం జేసీబీ సహాయంతో గుంత తవ్వించి నెమలి కళేబరాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాహుల్, జీపీఓ భూమన్న, ఫారెస్ట్ ఆఫీసర్ వరుణ్తో పాటు సంబంధిత శాఖల సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నెమలి మృతికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. విష గుళికల వల్లే నెమలి మృతి చెందిందా లేదా అనే అంశంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.