- భావి తరాలకు రోల్ మోడల్ గా నిలిచిన పూర్వ విద్యార్థులు
నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోల్డెన్ జుబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 1974 నుంచి 2024 వరకు పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామస్థులు, అధికారులు, ప్రస్తుత విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలు, భావి తరాలకు పాఠశాల పూర్వ విద్యార్థులను ఆదర్శంగా నిలిపాయి.

పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సత్కరించి, వారి సేవలకు గుర్తింపుగా ప్రత్యేకంగా మోమెంటోలు అందజేశారు. పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను పంచుకుంటూ, ఈ పాఠశాల ద్వారా సమాజంలో గౌరవనీయమైన స్థానం పొందామనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా, సమాజంలో రోల్ మోడల్స్గా ఎదిగి, తమ విజయాలతో ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ, తమ నిబద్ధతతో ఈ వేడుకలకు మరింత ప్రాముఖ్యత తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు ప్రసంగిస్తూ, పాఠశాల సాధించిన విజయాలను ప్రశంసించారు. పాఠశాల 65 ఏళ్ల విజయ ప్రస్థానం నందిపేట మండలానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల విజయానికి ప్రత్యేకంగా శ్రమించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహక కమిటీ సభ్యులు ఎర్రం సిలిండర్ లింగం, కండక్టర్ నారాయణ, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
