. . . గెలిచే గుర్రాలకే టికెట్లు
. . . నిజామాబాద్ బల్ధియా ఎన్నికల ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలో మున్నిపల్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మన పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఎన్నికల ఇంచార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుందని , మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని అన్నారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తామని, ఎటువంటి ప్రలోభాలకు తావులేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ గా మారాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8.5 శాతం మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందని ఇది ఓటర్ల తీర్పుపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్ళ పాటు అత్యంత స్థిరంగా ఉంటుందని రాబోయే ఎన్నికల్లోనూ మళ్ళీ మనకే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
. . . మన నిజామాబాద్ మన అభివృద్ది అనే నినాదంతో తాము ప్రజల్లోకి వెళ్తాం : పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన నిజామాబాద్ మన అభివృద్ది అనే నినాదంతో తాము ప్రజల్లోకి వెళ్తున్నట్లు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, నగర పాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యమని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి, నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. టికెట్ల కోసం ఎవరికి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురికావద్దని కార్యకర్తలకు సూచించారు. దేవుళ్ళ పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి కాదని, కేవలం హిందూ పేరుతో ఎంపీ అయిన ధర్మపురి అర్వింద్ నగర అభివృద్దికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగే వారు అభివృద్దిని విస్మరిస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్య విషం నింపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంత దూరమో, మజ్లీస్ పార్టీ కూడా అంతే దూరమని ఆయనే కీలక వ్యక్తం చేశారు. కులం, మతం పేరిట ప్రజల జీవితాలను విచ్చిన్నం చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

. . . అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్
అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల్లో చెప్పుకొని సులువుగా గెలవచ్చని, అభ్యర్థుల ఎన్నిక సర్వే ప్రకారమే జరుగుతుంది టికెట్లు ఆశించేవారు వార్డులోనే ఉండి ప్రచారం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, గత పార్లమెంట్ ఎన్నికల ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ క్యాడర్ సమన్వయంతో పనిచేయాలని, గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ఈ రెండు ఏళ్లల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలెక్కించిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనారిటీలు ,బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందనిమున్సిపల్ ఎన్నికల్లో వీరందరి మద్దతుతో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

. . . “ఐక్యతతోనే విజయం సాధ్యం : ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
జిల్లాలోని నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావాలని, మున్సిపల్ ఎన్నికలు మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా ద్వారా, ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మైనింగ్ కార్పేరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తదితరులున్నారు.

