మూడున్నర ఎకరాలు గల పార్కు ను అభివృద్ధి చేస్తాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమ్మ నగర్ కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ ఆఫీసు లో ఇటీవల కలిసి తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అమ్మ నగర్ కు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విచ్చేసి దాదాపు ఒక గంట సేపు కలియ తిరుగుతూ, కాలనీ వాసుల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీ లో గల రోడ్డు గుంతలను, రోడ్డు కు ఇరువైపులా డివైడర్ ల మధ్య లో పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను, వెంకటేశ్వర ఆలయం దగ్గర నిర్మించిన బ్రిడ్జి ప్రక్కన మట్టి రోడ్డు బురదతో ఉండడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బ్రిడ్జి కి బిటి లింక్ రోడ్డును త్వరలో పూర్తి చేస్తామని, రోడ్డు కు ఇరువైపుల, డివైడర్ ల మధ్య లో గల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలగింప చేసి వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటిస్తామన్నారు. వీధి లైట్ల ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీ లో గల కుక్కల బెడదను నివారిస్తామని, మూడున్నర ఎకరాలు గల పార్కు ను అభివృద్ధి చేస్తామని కాలనీ వాసులకు తెలియజేశారు.
