నిజామాబాద్, బతుకమ్మ : ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను ఆయన కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డి కి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల కల సాకారమైందనందున పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని మంత్రి అన్నారు. అంతేగాకుండా పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై వారు చర్చించారు. అతి త్వరగా పసుపు బోర్డు కార్యక్రమాలను మొదలుపెడతామని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి తనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో వారితోపాటు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరెపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
