కామారెడ్డి, బతుకమ్మ : బిడ్డతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండంలోని నర్సన్నపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాచమొల్ల స్రవంతి(24) శుక్రవారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడి తన నాలుగేళ్ల కొడుకు రుద్రేష్, ఏడేళ్ల కూతురు శ్రీవల్లితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. చిన్నమల్లారెడ్డి గ్రామ చెరువు వద్దకు రాగానే కూతురు తప్పించుకుని పారిపోయింది. నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.