. . . ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పేదల పట్ల మోడీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని నిరసించాలని సీపీఐ కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు, విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ ఏఐపీకేఎంఎస్, ఏఐయుకేఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్ కోటగల్లిలో సోమవారం సదస్సు నిర్వహించారు. ముందుగా రైతుకూలీ సంఘం నాయకులు అమరుడు శావులం సాయిలు చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సదస్సుకు ముఖ్య వక్తలుగా వచ్చిన సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ (వీజీజీ రామ్ జీ) బిల్లు తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ పథకం నుంచి గాంధీ పేరును తొలగించాలనే ఉద్దేశంతో పాటు, ఈ పథకం నుండి శాశ్వతంగా కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని కుట్ర చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలో పేదరికం కొద్ది మేరకు తగ్గడంతో పాటు, ఆత్మహత్యలు కూడా తగ్గాయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదస్సు అనంతరం ఏఐపీకేఎంఎస్, ఏఐయుకేఎస్ సంఘాల అర్బన్ జిల్లా కన్వీనింగ్ కమిటీలను ఎన్నుకున్నారు. ఏఐపీకేఎంఎస్ జిల్లా కన్వీనర్ గా కే.గంగాధర్ కో కన్వీనర్ గా గంగమల్లు, ఏఐయూకేఎస్ జిల్లా కన్వీనర్ గా ఎం.నారాయణ, కో కన్వీనర్ గా మల్లన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘాల నాయకులు ఒడ్డెన్న, శంకర్, మోహన్, నవీన్, సాయిలు, గంగారం, సీతారాం, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
