ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సదాశివనగర్ మండలం మోడేగావ్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోడేగావ్ గ్రామ సర్పంచ్ కౌడెల్లి గంగాధర్తో పాటు జువ్వాడ భిక్షపతి, దాసరి భాస్కర్, పెద్ద రాజయ్య, జువ్వల శ్రీనివాస్, బెస్త రాములు తదితరులు ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో మోడేగావ్ గ్రామంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.10 లక్షలతో స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి) భవనానికి నిధుల మంజూరు చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమను ఆకర్షించిందని నాయకులు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరుగుతోందని వారు అన్నారు. మోడేగావ్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ ఉపసర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
