Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 6:27 pm Posted by : ramakrishna

మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు

  • స్పెషల్ డ్రైవ్ ద్వారా 143 మొబైల్ ఫోన్లు రికవరీ
  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : మొబైల్ ఫోన్ల కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సిమ్ కార్డును బ్లాక్ చేసి అదే నంబరుతో కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. సీఈఐఆర్ వెబ్ సైట్ లో ఐఎంఈఐ నంబర్ ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ ను సులభంగా గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉందని అన్నారు. ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఆరుగురు సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ సంవత్సరం తొమ్మిది దఫాలుగా గత 15రోజుల్లో 143 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 1,722 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.2.75కోట్లు ఉంటుందని తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 143మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన టీంను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.

Mobile-centric cyber fraud