Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 3:54 pm Posted by : ramakrishna

నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

. . . ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదు

. . . తక్షణమే మరణించిన పిల్లల కుటుంబ సభ్యులకు 10 లక్షల నష్టపరిహారం అందించాలి

. . . బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్

హైదరాబాద్, బతుకమ్మ:  

 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్డల ప్రాణాలను ప్రాధాన్యతగల అంశంగా స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం నాడు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం  ఆమె విలేకరులతో మాట్లాడుతూ

MLC Kavita paramarsha for student

తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం చాలా బాధాకరమని అన్నారు. శైలజ ఇంకా కూడా వెంటిలెటర్ పై ఉన్నట్లు తెలియజేశారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్టు ఉండడం సరికాదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ ఒక్క పాఠశాలను చూసినా ఏదో ఒక సంఘటన జరిగిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు.మరణించిన 42 మంది పిల్లల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చోప్పున  నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుందని, సగటున నెలకు ముగ్గురు చొప్పున ఇప్పటి వరకు  42 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆహారం విషతుల్యమై మరణించారన్నారు. సగటున పదిరోజులకు ఒక పసి ప్రాణాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సంక్షేమ శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఉండడం వల్ల సమయం వెచ్చించలేకపోతున్నట్లు కనిపిస్తోందన్నారు. కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించి సమీక్ష చేస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుందని సూచించారు. నారాయణపేట హాస్టళ్లో విషతుల్య ఆహారం తినడం కారణంగా పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష చేసిన మరునాడే అలాంటి మరో సంఘటన జరగడం ఆందోళనకరమన్నారు. పిల్లలు కూడా ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదవే పిల్లలు ఐఐటీ, ఐఐఎంకు వెళ్లాలా లేకపోతే ఎవరెస్టు అధిరోహించాలా అన్న ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలతో వెళ్లిన సందర్భాన్ని తెలంగాణ సమాజం చూసిందని గుర్తు చేశారు.

MLC Kavita paramarsha for student