మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైంది నీట మునిగిన ప్రాంతాలను శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసిరకం పనులతో నిర్మించిన చెక్ డ్యామ్ నాణ్యత లోపించి దెబ్బతినడంతో ఈ పరిస్థితికి కారణమని ఎమ్మెల్యే తెలిపారు. చెక్ డ్యామ్, కెనాల్స్ ను పునర్నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు చెప్పారు. ఎమ్మెల్యే తానే స్వయంగా వాటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్ వేసి అధికారులకు వివరించారు. అధికారుల బృందం జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించి ఇవ్వాలని,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందేలా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
