Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 1:22 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే వేముల అధికారిక కార్యక్రమాలు వాయిదా

భీమ్ గల్, బతుకమ్మ: భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో తన అధికార కార్యక్రమాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. తదుపరి తేదీని మళ్లీ తెలుపుతామని పేర్కొన్నారు.

ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడి చేసి ఉగ్రవాదులను మట్టు బెట్టిన ఘటనను భారతీయుడిగా తాను సమర్థిస్తూ గర్విస్తున్నానని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదనే సందేశాన్ని యావత్ భారతావని అభినందిస్తోందని, ఉగ్రవాదం పై భారత సైన్యం చేస్తున్న పోరులో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై మద్దతుగా నిలబడాలని ఆయన కోరారు.

దేశ సరిహద్దుల్లో ఏర్పడిన యుద్ధ వాతావరణం దృష్ట్యా రేపు బాల్కొండ నియోజకవర్గములో జరగాల్సిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.