. . . భక్తులకు ఉచిత రవాణా సదుపాయం వినియోగించుకోవాలని పిలుపు
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఉన్న తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తరపున ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, మహిళలు, వికలాంగులు, చిన్నారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొండ కింద నుంచి కొండపై ఉన్న దేవాలయం వరకు ఉచిత వాహన సేవలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయంపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు పోచారం స్వయంగా వాహనాన్ని నడిపిస్తూ కొండ కింద నుంచి పైకి, తిరిగి పై నుంచి కిందకు మొత్తం నాలుగు ట్రిప్పులు నిర్వహించి భక్తులను చేరవేశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడిన ఆయన, ఈ ఉచిత రవాణా సేవలను మరింత మంది వినియోగించుకోవాలని, ఇతర భక్తులకు కూడా సమాచారం అందించాలని కోరారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ సేవలకు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీకి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, తిమ్మాపూర్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
