నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ నందేవాడలోని విఠలేశ్వర్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా విఠల రుక్మిణీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో కలిసి హారతులు సమర్పించారు. ఆలయ పూజారుల చేతుల మీదుగా ఆయనకు పూర్ణకుంభ స్వాగతం నిర్వహించి ఆలయ కమిటీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఈ మొదటి పండుగ హిందువులకు ప్రత్యేకమైందని అన్నారు. విష్ణు మూర్తి కృపతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యంగా రైతులకు తొలకరి వానలు కురిసే ఈ సమయంలో అనువైన వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుదీర్, ఆలయ కమిటీ సభ్యులు, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.