గాంధారి, బతుకమ్మ :
గాంధారి మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం చాలా వెనుకబడిందని, గత 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి, తొలి విడతలో 3,500కు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రెండో విడతలో వచ్చే ఏప్రిల్ నెలలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెన్నాపూర్ ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నాపూర్ గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
