నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద ఇటీవల మృతి చెందిన యువకుడు అజీమ్ కుటుంబ సభ్యులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం పరామర్శించారు. ఆటో నగర్ లోని వారి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబానికి ఆసరాగా నిలిచిన నవయువకుడు మృతి చెందడం బాధాకరమన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద ఇరిగేషన్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంతాలకు అనుమతించకపోవడం చేయాలన్నారు. ఈ అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు తన వంతు సహకారం ఉంటుంది అన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు కైసర్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, రాము, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
