. . . టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ఓటర్లలో ఎలాంటి అపోహలు తలెత్తకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించేలా బీఎల్ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నాయకులు వినయ్ రెడ్డి, తాహెర్ బిన్ హుందాన్ తదితరులు పాల్గొన్నారు.
