Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 6:35 pm Posted by : ramakrishna

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

 

. . . లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం

 

. . . సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు ఎ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధపడతామని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎ.రమేష్ బాబు అన్నారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు, ధర్నాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26,000 కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రమేష్ బాబు విమర్శించారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాలు అమలు చేసి, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, లేనిపక్షంలో వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలు, ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి భూపతి, నాయకులు మహేష్, నరేష్, సుర రవి, కిషన్, భూమయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Minimum wages must be implemented for municipal workers.