. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు
భీంగల్, బతుకమ్మ :
భీంగల్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులందరికీ సుప్రీంకోర్టు తీర్పుకనుగునంగా సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలను రాష్ట్ర వ్యాప్తంగా పెంచి అమలు జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భీంగల్ పట్టణంలో మున్సిపల్ కార్మికులకు బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పండగ సెలవులతో పాటు సంవత్సరానికి 12 సెలవులను అమలు జరపాలని ఆయనన్నారు. సమస్యలను పరిష్కరించని యెడల రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలో కార్మికులందరూ ఐక్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకవైపు పట్టణాల విస్తీర్ణం పెరుగుతా ఉంటే దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకుండా పనిచేస్తున్న కార్మికులపై పని భారాన్ని మోపడం సరైనది కాదని, అందువల్ల పెరుగుతున్న జనాభాకనుగుణంగా కార్మికులను పెంచాలని ఆయనన్నారు. కార్మికులు కోసం పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే పద్ధతుల్లో కార్మిక చట్టాలను సవరించే నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని వీటి మూలంగా కార్మికులు తమ హక్కులను కోల్పోతారని అందువల్ల తమ హక్కుల కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంజయ్యతో పాటు మున్సిపల్ యూనియ న్ నాయకులు ఓంకార్, రాజన్న ,విజయ్, మనోహర్ ,బాలమణి, గంగవ్వ, సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
