ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో బుధవారం ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ హాజరై మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంఘానికి చెందిన ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే క్యాంప్లో మహిళల ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా, ఈ-కేవైసీ, ఆన్లైన్ డేటా నమోదు వంటి వివరాలను పరిశీలించి నమోదు ప్రక్రియ చేపట్టారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు, సంఘ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
