Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 5:40 pm Posted by : ramakrishna

రుద్రూర్ లో ఔషధ మొక్కల దినోత్సవం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ & ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఔషధ మొక్కల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 4న నిర్వహించే ఈ కార్యక్రమంలో యజ్ఞం, యోగ సాధనతో పాటు ఔషధ మొక్కల నాటడం చేపట్టారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో యజ్ఞం, యోగాభ్యాసం నిర్వహించి, వివిధ రకాల ఔషధ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పతంజలి సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు డా. విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ, ఆచార్య బాలకృష్ణ లక్షలాది ఆయుర్వేద వనమూలికలపై పరిశోధనలు చేసి, ప్రాణాంతక వ్యాధులను సైతం నివారించే శక్తి ఆయుర్వేదంలో ఉందని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తిప్పతీగ (సంస్కృతంలో అమృతవల్లి – గిలోయ్)కు చెందిన 55 మొక్కలను గ్రామ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు గోశాలలో గోవులకు దాణా అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షుడు పుట్టి సాయిబాబా, యువ భారత్ అధ్యక్షుడు పురుషోత్తం, బీఎస్టీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు బెజగం వెంకటేశం గుప్తా, హన్మాండ్లు, తోట గంగన్న, సత్యనారాయణ, పోశెట్టి, గోసేవకులు తదితరులు పాల్గొన్నారు.