నిజామాబాద్, బతుకమ్మ : సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి( ZRUCC) సమావేశం సికింద్రాబాద్ రైల్ భవన్ లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాదు సభ్యులైన రావులపల్లి జగదీశ్వర్ రావు పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ సంజయకుమార్ శ్రీవాస్తవ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాముఖ్యతను, వారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాలు తెలుపుతూ సభ్యులను మరిన్ని సేవ సౌకర్యాల గురించి సూచనలు కోరారు. నిజామాబాదు తరపున జగదీశ్వర్ రావు ఒక సమగ్ర వినతి పత్రాన్ని 9 డిమాండ్లతో సమర్పించారు. పగటిపూట సికింద్రాబాద్, ముంబై వైపుకు ట్రైన్ సదుపాయం కల్పించాలని, నాందేడ్ వరకు వస్తున్న వందేభారత్ ను నిజామాబాదు వరకు పొడిగించాలని, తిరుపతికి వందేభారత్ సౌకర్యం కల్పించాలని, ఆర్మూర్ డిచ్ పల్లి మధ్య ట్రాక్ లింక్ కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలోని ప్లాట్స్ యజమానులను రక్షించాలని, తపోవన్ ఎక్స్ ప్రెస్, హైకోర్టు ఎక్స్ ప్రెస్, పూణే, ముంబై ఎక్స్ ప్రెస్, బెంగుళూరు, ఢిల్లీ ట్రైన్లను ధర్మాబాద్, నాందేడ్ ల నుంచి నిజామాబాదు వరకు పొడిగించాలని, ట్రాఫిక్ కు అనుకూలంగా ముంబై సికింద్రాబాద్ కు మరొక రైలు నడపాలని, గూడ్స్ షెడ్ మరొకచోటుకి తరలించాలని, నిజామాబాదు స్టేషన్ను లిఫ్ట్, సీసీ కెమెరాలు, స్కానింగ్, ప్రయాణికుల వసతులు తదితర సకల సౌకర్యాలతో త్వరగా అందుబాటులోకి తేవాలని, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని జగదీశ్వర్ రావు కోరారు. జనరల్ మేనేజర్ పరిష్కరిస్తామని zrucc కి హామీ ఇచ్చారు. మూడ్ఖేడ్ నుంచి జరుగుతున్న డబ్లింగ్ పనులు మరియు ఆర్వోబీ పనులు పూర్తయితే మరిన్ని రైళ్లు, సౌకర్యాలు నిజామాబాదుకి వస్తాయని శ్రీవాస్తవ తెలిపారు.. సమావేశం సామరస్యంగా జరిగిందని జగదీశ్వర్ రావు తెలిపారు.
