. . . వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
జనగామ, బతుకమ్మ :
భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడిని సానుభూతితో, గౌరవప్రదంగా స్వాగతించి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశించారు. శుక్రవారం జనగామలోని భరోసా కేంద్రాన్ని సీపీ ఆకస్మికంగా సందర్శించి, కేంద్రంలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, ఇతర బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందించే భరోసా కేంద్రం ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి కేసును నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ సుధా, లీగల్ అడ్వైజర్ దయామణి, సపోర్ట్ పర్సన్స్ స్వాతి, అపర్ణతో పాటు ఇతర సిబ్బంది సునీత, హరిత పాల్గొన్నారు.
