. . . మైనారిటీ సంక్షేమంపై రాష్ట్ర మంత్రి ని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రితో చర్చించారు. సమావేశంలో మైనారిటీ వర్గాల విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నాయకులు ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశం సానుకూల వాతావరణంలో సాగగా, కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.