. 9నెలల మేథోమథనం తరువాతే భూభారతి
. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ: పట్టా పాస్ పుస్తకాల్లోత్వరలోనే భూమి మ్యాపులను ఇస్తామని, అటవీ భూముల సమస్యలనూ పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని షెట్ పల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలల మేథోమథనం, అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తరువాత భూభారతి చట్టాన్ని రూపొందించామని తెలిపారు. కేసీఆర్ తను చెప్పించే చట్టంలా ధరణి తెచ్చి పేదల భూములు లాక్కోగా, తాము అంబేడ్కర్ స్ఫూర్తితో రోల్ మోడల్ గా ఉండేలా చట్టాన్ని రూపొందించామన్నారు. రెవెన్యూ యంత్రాంగమే భూ సమస్యలను పరిష్కరిస్తుందని, పదిహేను రోజుల్లో గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తామని అన్నారు.
అలాగే ఆరువేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు త్వరలో శిక్షణ ఇచ్చి లైసెన్సులు ఇస్తామన్నారు. మే 5లోగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్లు మంజూరుచేస్తామని, ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని, మళ్లీ వచ్చేది ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమేనని పొంగులేటి అన్నారు.

