- వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
- ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా..
- మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం
ములుగు, బతుకమ్మ : మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని మావోయిస్టులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా…? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు స్పష్టం చేశారు. జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని.. జీవో కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

