బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ సమీపంలోని పంట పొలాల్లో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దేశాయిపేట్ నారాయణ (45) పాత బాన్సువాడలోని గురు సిద్ధేశ్వర్కు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి భోజనం అనంతరం సుమారు 10 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన నారాయణ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య దేశాయిపేట్ సుజాత శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా, నారాయణ పొలంలో బోర్లా పడి మృతి చెంది ఉన్నాడు. పొలంలో ప్రమాదవశాత్తు జారిపడి బోర్లా పడటంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ పట్టణ సీఐ శ్రీధర్ తెలిపారు.