లింగంపేట, బతుకమ్మ :
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలత చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లింగంపేట మండల కేంద్రంలో శుక్ర వారం చోటు చేసుకుంది. ఎస్ఐ దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కోమాట్పల్లి పోచయ్య (48) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలిపారు. అప్పుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన పోచయ్య శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటి ముందున్న వేప చెట్టుకు ఉరివేసుకున్నట్లు తెలిపారు. పోశయ్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చేలోపే పోచయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.