- టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీయూసీఐ రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని జిల్లా పద్మశాలి సంఘం భవనంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తున్నదన్నారు. 8 గంటల పని విధానం రద్దుచేసి, 12 గంటల పని విధానం తీసుకొచ్చే కుట్రలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లోనే, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. యూనివర్సిటీ, కేజీబీవీ, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఆశ, అంగన్వాడి తదితర రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్మికుల హక్కులు, చట్టాల గురించి, పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాల పట్ల అవగాహన కోసం కార్మికులను మరింత చైతన్య పరచడం కోసం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని టియుసిఐ అనుబంధ సంఘాల కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో టీయూసీఐ జిల్లా నాయకులు సాయరెడ్డి, కిరణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.