Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 5:08 pm Posted by : ramakrishna

పీడీఎస్యూ జిల్లా మహాసభను విజయవంతం చేయండి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఈనెల 25న నిజామాబాద్ జిల్లా పీడీఎస్ యూ 23వ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ బాలుర వసతి గృహం ముందు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, యూనివర్సిటీ నాయకులు నితిన్ మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్, హైదరాబాద్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వంతో, పిడిఎస్యు నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పుట్టిన గడ్డమీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ యూ 23 వ మహాసభ ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బహిరంగ సభ, విద్యార్థి భారీ ర్యాలీ ఉంటుందన్నారు. దేశంలో రాష్ట్రంలో పేద విద్యార్థులకు అందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయన్నారు. గత ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు ప్రభుత్వ విద్య సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అందరికీ కామన్ విద్య అందించాలని, శాస్త్రీయ విద్య సాధనకై, సమ సమాజ స్థాపనకై, గత 50 ఏళ్లుగా అలుపెరగని పోరాటం పిడిఎస్యు చేస్తుందన్నారు. విద్యార్థులు, మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు చలామణి, సహస్, ప్రణయ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.