రుద్రూర్, బతుకమ్మ : మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నెలకు రూ.10 వేలు వేతనం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూ.10 వేలు వేతనంతో పాటు, నాలుగు నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఈనెల 28న సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంటకు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు రవీందర్, మధ్యాహ్న భోజన కార్మికులు సాయిలు, లక్ష్మి, అల్మాస్, రవి తదితరులు పాల్గొన్నారు.