Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 7:18 pm Posted by : ramakrishna

త్వరితగతిన పరిష్కారం పొందేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుంది

 

. . . జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఇరు వర్గాల సమ్మతితో త్వరితగతిన పరిష్కారం పొందెందుకు లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా న్యాయమూర్తి డా.సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్షణికావేశంలో ఏర్పడిన వివాదాలను సులభంగా, వేగంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక ఉత్తమ వేదిక అని తెలిపారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండి, పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో పరస్పర సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చన్నారు. అలాగే సైబర్ నేరాల విషయంలో రూ.25000 లోపు నష్టం జరిగిన సందర్భాల్లో కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జాతీయ లొక్ అదాలత్ విజయవంతం కావడానికి అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి, వేగవంతమైన న్యాయ పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.

 

Lok Adalat helps in getting speedy resolution