. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
పిట్లం, బతుకమ్మ :
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా శనివారం పిట్లం మండలం రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జుక్కల్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత (పింఛన్లు), రేషన్ & ఆహార భద్రత పథకాలు, విద్యుత్, ఇతర సబ్సిడీలు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 35 వేల మందికి కొత్త రేషన్ కార్డులను అందించామని పేర్కొన్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి ద్వారా దాదాపు 35 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అనంతరం మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బిచ్కుంద మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
