నిజామాబాద్ జిల్లా పొక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జిల్లాజడ్జి కనకదుర్గ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాలలపై విస్తృత మవుతున్న అన్ని రకాల హింసలను ,లైగిక దాడులకు నిరోధించాల్సిన గురుతర బాధ్యత పౌర సామాజంపై ఉన్నదని నిజామాబాద్ జిల్లా పొక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జిల్లాజడ్జి కనకదుర్గ తెలిపారు.శనివారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన చాంబర్ లో విలేఖరుల సమావేశంలో ఆమె పొక్సో చట్టం విశిష్టతను వివరించారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం-2012 ను చిన్నగా పొక్సో చట్టంగా పిలవడం జరుగుతున్న దని తెలిపారు. పొక్సో చట్టం ప్రకారం ప్రత్యేక పొక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పద్దెనిమిది ఏళ్ల లోపు బాల,బాలికపై జరిగిన లైంగిక దాడులను విచారిస్తాయని అన్నారు.గతంలో అమ్మాయిలకు చట్టపరమైన రక్షణ తక్కువగా ఉండేదని పొక్సో చట్టం అమలుతో వారికి చట్టపరమైన రక్షణ పెరిగిందని అన్నారు.పొక్సో చట్టం ద్వారా మగ పిల్లలకే శిక్షలు పడుతున్నాయని పేర్కొన్నారు. అమ్మాయి అయిన అబ్బాయి అయిన ప్రేమ అనే ఊబిలో చిక్కుకోరాదని కోరారు.ఇంటర్నెట్, పోర్నోగ్రపీ ప్రభావం వలన పిల్లలపై దుష్ప్రభావాలు పడుతున్నాయని అన్నారు. అక్రమ సంబంధాలు,కులాల మధ్య అంతరాల వలన పిల్లలపై ప్రభావం చూపి పొక్సో కేసులు పెరగడానికి ఒక కారణంగా ఆమె విశదీకరించారు.డ్రగ్స్ వినియోగం, సత్ప్రవర్తన లేకపోవడం ,సభ్యత సంస్కారాలు లోపించడం అనే పరిస్తితులు మగ పిల్లలపై ప్రభావం చూపిస్తున్నయని జడ్జి కనకదుర్గ అన్నారు. నేరాల తీవ్రతను బట్టి పొక్సో చట్టం ప్రకారం ఇరవై ఏళ్ళ జైలుశిక్షలు,ఉరి శిక్ష కూడా విధించాడానికి చట్టం వీలు కల్పిస్తుందని తెలిపారు.