Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 1:32 pm Posted by : ramakrishna

నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దాం

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

నిజామాబాద్, బతుకమ్మ  : నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతీనగర్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవంను విజయవంతం చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 51లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పూర్తి స్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, ఇంచార్జి డీఎఫ్ఓ నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ఆయా పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.


Let's make Nizamabad a green city.