Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 6:01 pm Posted by : ramakrishna

బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగడదాం

  • తెలంగాణలో మతసామరస్యాన్ని కాపాడుకుందాం
  •  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే.రమ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే.రమ పిలుపునిచ్చారు.  సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కోటగల్లిలో గల పద్మశాలి భవన్ లో నిర్వహించారు. ముందుగా సుత్తి, కొడవలి జెండాను జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. రమ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతం పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలపై, దళితులపై మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ దేశంలో పతనమవుతున్నదన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం,  నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.  శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు మెజార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశవాద వైఖరితో ఉంటున్నదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బిజెపి విభజన రాజకీయాల ప్రమాదాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని వామపక్ష పార్టీలు కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి,  మతసామరస్యాన్ని కాపాడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, లౌకికత్వం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ గడ్డమీద మతోన్మాదానికి చోటు లేదని చాటి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం మీద ఉందన్నారు. ఆ వైపుగా ప్రజలను మరింత చైతన్యం చేస్తామన్నారు.

  • నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా వనమాల కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక:

నిజామాబాద్ అర్బన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా వనమాల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, బోధన్ డివిజన్ కార్యదర్శి డి.రాజేశ్వర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా నాయకులు  కే.గంగాధర్, బి.మల్లేష్, ఏ.రవీందర్, సీ.హెచ్ సాయన్న, డి.కిషన్, బి.మురళి మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.