- సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ డీవీకే ఆశయాలు కొనసాగిద్దామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. విప్లవోద్యమ నాయకుడు, ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డీవీ కృష్ణ 3వ వర్ధంతి సభ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీవీకే నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ డి.వి కృష్ణ ఆదర్శ కమ్యూనిష్టు అని, విప్లవోద్యమానికి, ఆయన చేసిన కృషి అజరామరం అని కొనియాడారు. కామ్రేడ్ డీవీకే సైద్దాంతిక, రాజకీయ రంగాలన్నింటినీ నిశితంగా పరిశీలన చేసి సరైన సిద్ధాంతం కోసం మొక్కవోని పోరాటం చేశాడన్నారు. 50 సంవత్సరాల విప్లవ జీవితమంతా విప్లవోద్యమం నిర్మించడానికి, అతివాదాన్ని మితవాదాన్ని వ్యతిరేకించి నిలబడ్డాడని అన్నారు. పార్టీని సరైన పంథాలో తీర్చిదిద్దడానికి కృషి చేశాడన్నారు. కామ్రేడ్ డీవీ కృష్ణ ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఉన్నతమైనవన్నారు. ఆయన ఆశయాల కొనసాగింపే ఆయనకు మనమిచ్చే వినమ్ర విప్లవాంజలి అవుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికత్వం ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. పాలకవర్గాలు ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ప్రజావ్యతిరేక చర్యలను అవలంబిస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయన్నారు. ఈ పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ప్రజా ఉద్యమాలతో పాలకవర్గాల మెడలు వంచడమే కామ్రేడ్ డీవీకేకు నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ వర్ధంతి సభలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం. నరేందర్, నిజామాబాద్, బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం.వెంకన్న, డీ.రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కే.గంగాధర్, బి.మల్లేష్, సిహెచ్ సాయన్న, డి.కిషన్ బి.మురళి, పి.సాయన్న పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, వీడియోస్ జిల్లా కార్యదర్శి కే.గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా టియుసిఐ జిల్లా నాయకులు కిరణ్, రవి అరుణోదయ జిల్లా నాయకులు కే గంగారం, చరణ్, రమేష్ వివిధ ప్రజాసంఘాల నాయకులు శకుంతల, నర్సక్క, అమూల్య, మంజుల, గంగాధర్, మల్లవ్వ మహిపాల్ సృజన్ శాంతి కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
