Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2025, 6:51 pm Posted by : ramakrishna

పెద్దాసుపత్రిలో పేద రోగుల అవస్థలు తీర్చుదాం

  • సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేసిన విధానాల గూర్చి పలు దిన పత్రికలు, డిజిటల్ మీడియాలో కథనాలు రావడాన్ని సుమోటో పిటిషన్ గా స్వీకరించిన నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి.వి. ఎన్ భారత లక్ష్మీ,జి.జి. హెచ్ అధికారులను పిలిపించి పెద్దాసు పత్రిలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకాలని సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ను ఆదేశించారు. దీంతో ఆయన మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రాములు లను జిల్లాకోర్టు ప్రాంగాణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవ సదన్ కు పిలిపించి మాట్లాడారు. ఆసుపత్రి బయట చుట్టుపక్కల అంతస్థుల పైనుండి పైపుల లికేజి వలన  ఇబ్బందులు, లిఫ్ట్ లు కొన్ని పని చేయకపోవడం, మహిళ రోగులు, బాలలు, బాలింతలు పడుతున్న భాధలు తీర్చే విదంగా కార్యాచరణ ఉండాలని జడ్జి ఉదయ్ వారికి తెలిపారు. అందుకు స్పందించిన డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాములు ట్రామా కేర్ సెంటర్, మాతా శిశు సంరక్షణ కేంద్రంతో పాటు లిఫ్ట్ లను సరైన తీరులో ఉపయోగంలోకి తేవడానికి ఆర్థిక వనరులు ఉన్నాయని సంబంధిత ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.

  • జిజి హెచ్ పై “న్యాయసేవ సంస్థ “దృష్టికోణం..

న్యాయసేవల చట్టం 1987 కు అనుగుణంగా జాతీయ స్థాయిలో జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థలు, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థలు, మండల స్థాయిలో మండల న్యాయసేవ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ చట్ట ప్రకారం ఏ విధమైన సామాజిక సమస్యలపై, అనాధికార సంఘాలు చట్ట వ్యతిరేకంగా వ్యవహారిస్తే స్పందించే అధికారం సంస్థలకు ఉంది.