Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 6:49 pm Posted by : ramakrishna

సాయుధ పోరాట స్ఫూర్తితో తిరగబడదాం

రుద్రూర్, బతుకమ్మ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తిరగబడదామని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పిలుపునిచ్చారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం నిర్వహించి, అమరవీరులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ, ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వం ప్రజలపై శిస్తుల పేరుతో దోపిడీ చేస్తే, ఈనాటి నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపుతోందని, నవాబుకు, నరేంద్ర మోడీకు మధ్య తేడా ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే ఆనాటి దొరలకు, భూస్వాములకు, దేశ్ ముఖ్ లకు, పటేల్ పట్వారిలకు పట్టిన గతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కార్యదర్శి నెల్లూరి లక్ష్మణ్, నాయకులు నరసింహులు, ఇస్మాయిల్, సాయవ్వ, లక్ష్మి, రవికాంత్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.