Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 6:58 pm Posted by : ramakrishna

సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం పోరాడుదాం

  • కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
  • సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం పోరాడుదామని, కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. మహాత్మ జ్యోతిభాపూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ(ఎంఎల్)  మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “కుల నిర్మూలన సదస్సు”ను కోటగల్లీలోని జిల్లా పద్మశాలి భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిభాపూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగాను, దాని నిర్మలనా లక్ష్యంగాను 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ ను ఏర్పరిచారన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన చైతన్య సదస్సులు, సమావేశాలు జరుపుతున్నామన్నారు. మన దేశంలో కుల వ్యవస్థ సామాజిక ప్రజాస్వామ్యానికి, రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్షంగా వ్యతిరేకంగానూ, ఆటంకంగాను ఉన్నదన్నారు. కులాంతర వివాహాల వల్లనే కుల నిర్మూలన లక్ష్యం సాకారమౌతుందన్నారు. కులాంతర, మతాంతర, ప్రేమ వివాహాలను ప్రభుత్వాలు, పౌర సమాజం ప్రోత్సహించాలన్నారు. కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకున్న వారిపై పరువు పేరుతో హత్యలు, దాడులు చేయడం గత 12 సంవత్సరాలుగా తీవ్రమైందన్నారు. ఎందుకు ఆర్ఎస్ఎస్, బిజెపి శక్తుల కుల, మతోన్మాద రాజకీయాలే కారణమన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ కరువైందన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలు అందించడంలో పాలకవర్గాలు తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. కులాంతర, మతాంతర, ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం, పోలీసులు రక్షణ కల్పించాలని, కనీసం 10 లక్షల రూపాయలు ప్రోత్సాహకం అందించాలని, ఉపాధి మార్గాలను చూపించాలని డిమాండ్ చేశారు. పరువు హత్యలు,  దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ఏ లక్ష్యం కోసం సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారో, ఆ లక్ష్యం కోసం పనిచేయాల్సిన కర్తవ్యం ప్రస్తుతం మరింత పెరిగిందన్నారు. సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం మరింత చైతన్యవంతంగా పోరాడాలన్నారు.  అరుణోదయ కళాకారులు తమ పాటలతో చైతన్యపరిచారు. ఈ సదస్సులో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న, బోధన్ డివిజన్ కార్యదర్శి డి.రాజేశ్వర్, సీఎల్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, మాస్ లైన్ జిల్లా నాయకులు కే.గంగాధర్ లు మాట్లాడారు. పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా నాయకులు బి.మల్లేష్, డి.కిషన్, బి.మురళి, పీవోడబ్ల్యు జిల్లా కార్యదర్శి కే.సంధ్యారాణి, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి కే.గణేష్ నాయకులు గంగమల్లు, గంగారం, శంకర్, నాగమణి, భాస్కర స్వామి, రమేష్, అమూల్య, చరణ్, తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు.

Let us fight for the eradication of caste with the spirit of Satyashodhak Samaj