. . . సర్వ సమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇందూరు నగరం మొత్తం ఏకమై నిర్వహించే అతిపెద్ద సాంస్కృతిక వేడుక అయిన ఊర పండుగను ఈ ఏడాది కూడా నగర ప్రజలందరి సహకారంతో వైభవంగా నిర్వహించనున్నట్లు సర్వసమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆగస్టు 2న జరగనున్న ఊర పండుగ ఏర్పాట్లపై ఆదివారం సిర్నాపల్లి గడిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఊర పండుగ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. పండుగలో భాగంగా జూలై 30న సంప్రదాయబద్ధంగా బండారు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నగరంలోని అన్ని కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అత్యంత వైభవంగా ఊర పండుగను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నగరంలో పెరుగుతున్న భూకబ్జాల అంశంపై కూడా చర్చించారు. ముఖ్యంగా దేవాలయాల భూములను ఆక్రమిస్తున్న వారిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. దేవాలయాల భూముల సంరక్షణ కోసం సర్వసమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో సర్వసమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో-కన్వీనర్ ఆదే ప్రవీణ్, అంతి రెడ్డి సుదన్, తొండూరు అశోక్, బంటు బలరాం, భక్త వత్సలం, సత్యపాల్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
