మెదక్, బతుకమ్మ :
గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిరుత మృతి చెందిన ఘటన గంగాపూర్ శివారులో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ మండలం లోని గంగాపూర్ శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాపూర్, శమ్నాపూర్, లక్ష్మాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదివారం ఉదయం రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో అది అక్కడికక్కడే చనిపోయించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన చిరుతను జిల్లా ఫారెస్ట్ అధికారి జ్యోతి, రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, ఇతర సిబ్బంది పరిశీలించారు. సుమారు మూడేళ్ల వయసు గల ఆడ చిరుత చనిపోయినట్లు వారు తెలిపారు. అనంతరం కళేబరాన్ని అర్బన్ పార్క్ వద్దకు తరలించారు. అక్కడ పోస్టు మార్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపడుతామని అధికారులు తెలిపారు.