హైదరాబాద్, బతుకమ్మ :
గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు, మొదటి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని మంత్రులు ప్రార్థించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
