Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 9:58 pm Posted by : ramakrishna

బల్ధియాలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు కుట్రలు

 

. . . మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

ఇందూరు కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేస్తామనే భయంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ బృందం శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ లిస్టులో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయన్నారు. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులను ఓటర్ లిస్ట్‌లో చేర్చడం గమనించామని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్య అని అన్నారు.ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరకుండా చూడాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎన్ని జిమ్మికులు చేసినా, ఇందూరు కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్ మొత్తం తప్పుల తడకగా ఉందని, ఈసీ నుంచి డౌన్‌లోడ్ చేశామని కమిషనర్ గారు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఇతర జిల్లాల వ్యక్తులకు అర్బన్ ఎన్నికల ఓటర్ లిస్ట్‌తో ఏ విధమైన సంబంధం ఉందని ప్రశ్నించారు. వెంటనే ఈ తప్పులను సరిచేయాలని, లేకపోతే బీజేపీ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీలోపు అన్ని డివిజన్లలో ఓటర్ లిస్ట్‌ను పూర్తిగా పరిశీలించి సరిచేయాలని కమిషనర్‌ను కోరినట్టు తెలిపారు కొన్ని స్పష్టమైన ఉదాహరణలను కమిషనర్ కి చూపించడం జరిగిందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పారదర్శకమైన, తప్పులేని ఓటర్ లిస్ట్ తయారు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కలెక్టర్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడం పట్ల కూడా అనేక అనుమానాలు ఉన్నాయని, అంత అత్యవసరంగా బదిలీ చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని ప్రశ్నించారు. దొంగ ఓట్లను పూర్తిగా ఏరివేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుతో కమిషనర్‌కు ఫోన్‌లో మాట్లాడించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, కార్యదర్శి దాంపల్లి జ్యోతి, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు ప్రమోద్, బద్దం కిషన్, ఇప్పకాయల కిషోర్, వినోద్ రెడ్డి, మల్లేష్ గుప్తా, బూరుగుల వినోద్, గడ్డం రాజు, తారక్ వేణు, అంబదాస్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ రెడ్డి, సంతోష్, అమందు విజయ్ కృష్ణ, చిరంజీవి, భాస్కర్, సందీప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Large-scale conspiracies to register fraudulent votes are underway in the municipality