* సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు
* కబ్జా దారులను వదిలి
ఇంటి ముందు రేకులు వేసుకున్న వ్యక్తిపై అధికారుల జులుం
* గ్రామ కార్యదర్శి, ఎంపీఓల వైఖరి పై విమర్శలు
* డిపిఓ కు ఫిర్యాదు చేసిన బాధితుడు
బతుకమ్మ, మాచారెడ్డి:
తన ఇంటి ముందు రేకులు వేసుకుంటే భూ కబ్జా అవుతుందా…? అవును… అవుతుంది! ఇది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండ ( మాచారెడ్డి చౌరస్తా) గ్రామపంచాయతీలో అమలవుతున్న కొత్త చట్టం. గజ్యా నాయక్ తాండ గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యుడు అజీజ్ అన్నదమ్ములకు వీక్లీ మార్కెట్ లో అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. వీక్లీ మార్కెట్లో ఉండడం వల్ల కొన్ని షాపింగ్ షట్టర్లు కూడా ఆ ఇంటిలోనే నిర్మించుకున్నారు. వారం రోజుల క్రితం చిరు వ్యాపారం చేసుకుంటున్న ఆ షెటర్ల ముందు పందిరి మాదిరిగా అందరూ వేసుకున్నట్టుగానే రేకులు వేసుకున్నారు. ఇది భూకబ్జా అని సోషల్ మీడియాలో ఒక నాయకుడు వైరల్ చేశాడు.

రేకులు వేసుకుంటే కబ్జా అవుతుందా…? కబ్జా చేసిన వారు వీక్లీ మార్కెట్ చుట్టుపక్కలనే ఉన్నారంటూ ఫొటోలు తీసి అజీజ్ అనే మాజీ వార్డు సభ్యుడు అదే సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది కాస్త గ్రామ కార్యదర్శి , ఎంపిఓ లో దృష్టికి వచ్చింది. వారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జెసిబి తీసుకొచ్చి ఆ రేకులను తొలగించేందుకు అత్యుత్సాహం చూపారు. ఆ ఇంటి యజమానులు అడ్డుకోవడంతో మార్చి ఒకటో తేదీన నోటీసు జారీ చేసినట్లు మూడవ తేదీన ఆ ఇంటికి అతికించడం అధికారి తప్పిదానికి నిదర్శనం. అంతటితో ఆగకుండా వీధి దీపాలను సిబ్బందితో కట్ చేయించడం, గ్రామపంచాయతీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని, దానికి నిరసనగా వీధిలైట్లు, నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేయడం కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నారు.
బెదిరింపులకు పాల్పడ్డాడని ఒక నాయకుడు, వీధిలైట్లు వెలగకుండా వైర్ కట్ చేయించి, మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మరొకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే భూ కబ్జా బాగోతం బట్టబయలవుతుందని స్థానికుల అభిప్రాయం.
