Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 6:41 pm Posted by : ramakrishna

ముందస్తు గుర్తింపుతో కిడ్నీ క్యాన్సర్‌ను జయించవచ్చు

 

. . . నెఫ్రాలజిస్ట్ డా.అజయ్ కుమార్ పాటిల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కిడ్నీ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా. అజయ్ కుమార్ పాటిల్ అన్నారు. ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ దశల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తారని, దీంతో చికిత్స మరింత క్లిష్టమవుతుందని పేర్కొన్నారు. మూత్రంలో రక్తం కనిపించడం, నడుము లేదా పక్క భాగంలో నిరంతర నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక నిర్ధారణ పరీక్షల ద్వారా కిడ్నీ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా డా.అజయ్ కుమార్ పాటిల్ మాట్లాడుతూ, “ధూమపానం, అధిక రక్తపోటు, ఊబకాయం, కుటుంబ చరిత్ర, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు కిడ్నీ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యం గా హై రిస్క్ ఉన్న వ్యక్తులు నిర్దిష్ట వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని తెలిపారు. కిడ్నీ క్యాన్సర్ రోగులు శారీరక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనను కూడా ఎదుర్కొంటారని, కుటుంబ సభ్యులు, వైద్య బృందం నుంచి లభించే మద్దతు రోగుల కోలుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌లో అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణు ల బృందం అందుబాటులో ఉందని, కిడ్నీ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్స కోసం సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అనుమానాస్పద లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని డా. అజయ్ కుమార్ పాటిల్ సూచించారు.